శ్రీశైలంలో పవర్ జనరేషన్ ఎప్పుడు! అసలు జరిగిన నష్టమెంత? 

కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే వందలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. శ్రీశైలం నుంచి ఇంకా నీటిని దిగువకు వదులుతూనే ఉన్నారు. అయితే వరద భారీగా వస్తున్న శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్ చేయలేకపోతోంది తెలంగాణ సర్కార్. ప్లాంట్ లో ఆగస్టు 20న భారీ ప్రమాదం జరిగింది. అయితే రెండు నెలలు కావస్తున్నా పవర్ ప్లాంట్ లో మరమ్మత్తులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో పవర్ జనరేషన్ సాధ్యం కావడం లేదు. పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై గప్ చుప్ గా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కార్.. ప్రమాద తీవ్రత ఎంతన్నది ఇప్పటికి చెప్పడం లేదు. 

 

ప్రమాదం తర్వాత ప్లాంట్ ను పరిశీలించిన జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీలు.. నెలరోజుల్లోపే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పారు. మరమత్తులు జరుగుతున్నాయంటూ ఎవరిని లోపలికి అనుమతించ లేదు. పవర్ ప్లాంట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన  విపక్ష నేతలను అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగి రెండు నెలలు పూర్తయ్యాయి. కాని  పవర్ జనరేషన్ మాత్రం మొదలు కాలేదు. దీంతో ప్రమాదంలో పవర్ ప్లాంట్ లో భారీగానే నష్టం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ ప్లాంట్ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన కమిటీలు, సీఐడీ నివేదికలు ఇంకా రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. 

 

ఆగస్టు 20 అర్ధరాత్రి శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌‌ ప్లాంట్‌‌లో ప్రమాదం జరిగింది. ప్లాంట్‌‌లో 150 మెగావాట్‌‌ల కెపాసిటీ ఉన్న ఆరు యూనిట్లలో నాలుగు యూనిట్లు భారీగా దెబ్బతిన్నాయి. రెండు యూనిట్లు బాగానే ఉన్నాయని అధికారులు చెప్పినా.. వాటిలోనూ విద్యుత్ ఉత్పత్తి ఇంకా షురూ కాలేదు. గత రెండు నెలలుగా నీళ్లు తోడడానికి, క్లీన్‌‌ చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి స్టార్ట్ చేయాలని ప్రయత్నించినా... మళ్లీ షార్ట్‌‌ సర్క్యూట్‌‌ అయినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం దాన్ని మాక్‌‌ డ్రిల్‌‌ అని చెప్పి కప్పి పుచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.  రెండు యూనిట్లను ఈ నెల15న స్టార్ట్‌‌ చేయాలని భావించారు. కానీ లోడ్‌‌ తీసుకోవడం లేదని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది.  

 

పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.  జెన్ కో ,  టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీలు, ట్రాన్స్‌‌కో జెఎండీ శ్రీనివాస్‌‌రావుతో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లతో ప్రత్యేక టెక్నికల్‌‌ కమిటీనీ కూడా వేసింది. ఈ సంఘటన ప్రమాదమా? ఏదైనా కుట్రకోణమా? అనేది తేల్చేందుకు సీఐడీ టీమ్‌‌ ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కుట్రకోణం లేదని ప్రమాదమనే సీఐడీ నివేదిక రూపొందించినట్లు సమాచారం.  ప్రమాదం ఎలా జరిగిందనేది తేల్చేది మాత్రం ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీనే. గత నెలలో రెండు రోజుల పాటు శ్రీశైలంలో తిష్టవేసి ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ దర్యాప్తు చేపట్టింది. టెక్నికల్ కమిటీ శ్రీశైలం వెళ్లి కూడా ఇప్పటికే నెల కావస్తోంది. అయినా రిపోర్టు అందించలేదు. సీఎండీకీ, ఇద్దరు డైరెక్టర్లకు కరోనా రావడంతో నివేదిక రూపొందించడంలో జాప్యం జరిగినట్లు మంత్రి జగదీష్‌‌రెడ్డి కౌన్సిల్‌‌ సమావేశంలో వెల్లడించారు. అయితే రెండు రిపోర్టులు వేర్వేరుగా వస్తే సమస్య అని రెండింటినీ పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రిపోర్టులు ఇవ్వడానికి ఇంకా టైమ్ పడుతుందని సమాచారం. మొత్తంగా శ్రీశైలం ప్రమాదాన్ని టెక్నికల్‌‌ ప్రాబ్లమ్‌‌గా తేల్చే పనిలో ఉన్నట్లు తెలిసింది.

 

శ్రీశైలం పవర్‌‌ప్లాంట్ ప్రమాదంపై విద్యుత్‌‌ వర్గాలు మొదటినుంచీ రహస్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదం ఘటన బయటపడకుండా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. వీడియోలు బయటికి రాకపోతే అసలు విషయాన్నే బయటికి రాకుండా చూసేవాళ్లన్న అనుమానాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. రెస్క్యూ బృందాలను పంపకుండా మంత్రి, సీఎండీ స్వయంగా వెళ్లడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. వీరిద్దరూ తెల్లవారుజామునే ప్లాంటుకు చేరుకోగా, రెస్క్యూ బృందాలు మాత్రం మరునాడు మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రైవేట్ సిబ్బంది ఉన్న టైంలో షార్ట్ సర్క్యూట్ జరిగితే దాన్ని మాక్ డ్రిల్ అని కప్పిపుచ్చారన్న విమర్శలు వచ్చాయి. సొంత సిబ్బంది ఉన్నప్పడు చేయాల్సిన మాక్‌‌ డ్రిల్‌‌ ప్రైవేటు సిబ్బంది ఉన్నప్పుడు ఎలా చేస్తారన్న అనుమానాలు తలెత్తాయి. మొత్తంగా రెండు నెలలైనా  పవర్ ప్లాంట్ ఘటనపై మిస్టరీ అలాగే ఉండిపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.