మాట వినని అధికారిని తప్పించి.. వినే అధికారిని తెచ్చుకున్న కేసీఆర్!!

 

సీఎం కేసీఆర్ మాటను రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్‌ తివారీ విననందునే ఆయనపై బదిలీ వేటు పడిందని తెలంగాణ ఐఎఎస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తుంటే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న తివారి అడ్డుపడు తున్నారని, గత కొంత కాలంగా ఇదే అంశంపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రెవిన్యూ ఉద్యోగులు కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురావద్దని ఎంత ఒత్తిడి తెచ్చినా సీఎం మాత్రం తాను అనుకున్నట్లుగానే రెవిన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన వెంట తివారీ కలసి రాకపోవడంతో.. ఆయనను బదిలీ చేశారని తెలుస్తోంది. తాను ఏమి చెప్పినా.. రెవిన్యూశాఖ ప్రధాన కార్యదర్శి పట్టించుకోరని, ఇక ఉపేక్షించి ఉపయోగం లేదనే భావనతోనే ఆయనపై వేటు వేశారని ప్రచారం జరుగుతోంది. కాగా నూతనంగా రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిన సోమేష్‌కుమార్‌ సీఎం కేసీఆర్ కు ఎంతో విధేయులు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోమేష్‌కుమార్‌ కేసీఆర్ కు ఎంతగానో సహకరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ ఆయనను జిహెచ్‌ఎంసి కమీషనర్‌గా నియమించారు. ఆ తరువాత ఆయనను అక్కడ నుంచి బదిలీ చేసినా ప్రాధాన్యత గల పోస్టునే ఇచ్చారు. తాజాగా తన మాటను దాటని సోమేష్‌కుమార్‌కు రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇచ్చారని, దీంతో కేసీఆర్ అనుకున్నట్లు నూతన రెవిన్యూ చట్టం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.