పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి, ఉన్నతాధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇతర ముఖ్య అధికారులతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

సీతారామ ప్రాజెక్ట్ పై IAS లు,  ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ లతో మంత్రి పువ్వాడ, స్మిత సబర్వాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌ పనులను వీరు పరిశీలించారు. పనుల పురోగతిపై ఎస్‌ఈ, సీఈ లను వివరాలడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం పనులు వేగంగా చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులు, కాట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు.