నిద్రలేమికి చెక్ పెట్టాలంటే...!

 

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో... నిద్ర కూడా అంతే అవసరం. కానీ మారుతున్న జీవన విధానం మనిషికి నిద్రను దూరం చేస్తోంది. ఒత్తిడి పెరిగిపోయి కంటి మీదకి కునుకు రానంటోంది. చిన్నగా కనిపించినా ఇది పెద్ద సమస్యే. నిద్రలేమి మన పనితనాన్ని, జీవనాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి తగినంత నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే ఎలా నిద్రపోవాలి అనకండి. దానికి కొన్ని సింపుల్ చిట్కాలున్నాయి. కేవలం కొన్ని రకాల ఆహార పదార్థాలతో సమస్యను దూరం చేసుకోవచ్చు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

 

సాధారణంగా అందరూ పాలు ఉదయం పూట తాగుతుంటారు. అది మంచిదే కానీ రాత్రి పూట పాలు తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంది. పాలు, పాల ఉత్పత్తుల్లో మెదడును శాంతపరిచే నాడీ ప్రసారకాలు ఉంటాయి. అవి చక్కగా నిద్రపోడానికి సహకరిస్తాయి. అందుకే రాత్రిపూట ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే నిద్రాదేవత మిమ్మల్ని కరుణించడం ఖాయం. అదేవిధంగా అరటిపండ్లు. వీటిలో ఉండే పొటాసియం, మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి. ఈ పండ్లలో ఉండే ట్రిప్టోపాస్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించిన తరువాత సెరటోనిన్ గా మారి స్ట్రెస్ ను తగ్గిస్తుంది. దానివల్ల ప్రశాంతత చేకూరి నిద్ర పడుతుంది. చెర్రీస్ కూడా నిద్రలేమికి మంచి మందు. వీటిలో ఉండే మెలటోనిన్ నిద్రని క్రమబద్ధం చేస్తుంది. అందుకే రాత్రిపూట కొద్దిగా చెర్రీస్ ని తీసుకుంటే మంచిది. అంతేకాదు... ట్యూనా ఫిష్ కూడా నిద్ర సమస్యను తీర్చే దివ్యౌషధం. దీనిలో ఉండే బీ6 విటమిన్ నిద్ర పట్టడానికి చక్కగా సహకరిస్తుంది. అదే విధంగా బాదంపప్పులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం కండరాల మీద ఒత్తిడిని తగ్గించి చక్కగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే థయమిన్ కూడా నిద్రలేమికి చెక్ పెడుతుంది.

 

చూశారు కదా! ఒకవేళ మీరు కనుక నిద్రలేమితో బాధపడుతుంటే వెంటనే మీ రాత్రిపూట ఆహారంలో వీటిని చేర్చుకోండి. వెంటనే నిద్ర వచ్చి మీ కన్నులపై వాలిపోతుంది చూసుకోండి.