ఎయిర్ ఇండియా ఉద్యోగస్తుడిని చెప్పుతో కొట్టిన ఎంపీ...

 

రాజకీయ నాయకులు అప్పుడప్పుడు అధికారం ఉంది కదా అని తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. అలా చూపించి ఇప్పటికే ఎంతోమంది బుక్కైన సందర్బాలు ఉన్నాయి. ఇప్పుడు మరో రాజకీయ నాయకుడు బుక్కయ్యాడు. అతను శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్. ఎయిర్ ఇండియా ఉద్యోగస్తుడిపై ఏకంగా  చెప్పుతో కొట్టి తన ప్రతాపం చూపారు. వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం పుణె నుంచి న్యూఢిల్లీ వెళ్లే విమానంలో ఆయన ప్రయాణించారు. తాను బిజినెస్ క్లాస్ టికెట్ కోసం డబ్బు చెల్లిస్తే, ఎకానమీ క్లాస్ టికెట్ ఇచ్చారంటూ సదరు సిబ్బందితో ఆయన వాదనకు దిగారు. బిజినెస్ క్లాసులో సీట్లు ఖాళీ లేకపోవడంతో ఎకనామీ క్లాసు టికెట్ ఇచ్చానని సిబ్బంది సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన రవీంద్ర గైక్వాడ్ తన చెప్పుతో ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై దాడి చేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనను మీడియా ప్రశ్నించగా...  ‘అవును, కొట్టాను.. ఎయిర్ ఇండియా సిబ్బంది వారి ఇష్టానుసారం మాట్లాడుతుంటే..నేను మారుమాట్లాడకుండా ఉంటానని మీరు అనుకున్నారా?’ అంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమివ్వడం గమనార్హం.