సీఎస్ కు నిమ్మగడ్డ మూడో లేఖ! హైకోర్టు తీర్పును జత చేసిన ఎస్ఈసీ 

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వెనక్కి తగ్గడం లేదు. వచ్చేఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్నారు. ఇప్పటికే సీఎస్‌ నీలం సాహ్నికి రెండుసార్లు లేఖ రాశారు. తాజాగా ఆయన మళ్లీ మరోలేఖ రాశారు. ఇందులో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహాయ, సహకారాలు అందించాలని కోరినట్లు తెలుస్తోంది.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఈనెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కూడా ఆ లేఖతో పాటు నిమ్మగడ్డ పంపించినట్లు సమాచారం. ఎన్నికల సంఘం జారీ చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పునూ, ప్రభుత్వం నుంచి అవసరమైన సహచారం కోసం ఎన్నికల సంఘం మూడోరోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు సూచననూ ప్రస్తావించారని సమాచారం. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు నిమ్మగడ్డ జతచేసి పంపినట్లు చెబుతున్నారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని లేఖలో నిమ్మగడ్డ సీఎస్ కు గుర్తుచేశారని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ, కమిషన్ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఇదే విషయాన్ని తన లేఖలో ఎన్నికల కమిషనర్ ప్రస్థావించారు. 

 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధమని ఎన్నికల సంఘం అంటోంది. కరోనా తీవ్రత కారణంగా ఇప్పుడే ఎన్నికలు వద్దంటోంది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. అయితే ఆమె నుంచి సరైన ప్రతిస్పందన రాలేదు. దీంతో సీఎస్ కు నిమ్మగడ్డ రమేశ్ ముచ్చటగా మూడోసారి లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లకు సహకరించేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని ఆ లేఖలో సీఎస్ ను నిమ్మగడ్డ కోరారు. 

 

ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఎస్ సహకరించకపోవడంతో మీటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. సోమవారం ఏర్పాటు చేసిన మీటింగ్‌కు అధికారులు ఎవ్వరు రాలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు, ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్‌ నిర్వహించాలని నిమ్మగడ్డ రమేశ్‌ పట్టుదలతో ఉన్నారు. దీంతో  సీఎస్‌ నీలం సాహ్నికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరో లేఖ రాశారు. ఎస్ఈసీ రాసిన మూడో లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.