టీడీపీదే విజయం.. త్వరలో పార్టీ చేరికపై నిర్ణయం : సబ్బం

మాజీ ఎంపీ సబ్బం హరి ఒకప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగారు.. విభజన అనంతరం కాంగ్రెస్ ని వీడి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. అయితే తాజాగా సబ్బం హరి ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి, తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం కంచుగుమ్మల పంచాయతీ శివారు భోగాపురంలో తన అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరి మాట్లాడారు.. ఇప్పటికిప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీదే విజయమని అన్నారు.

 

 

చంద్రబాబు కన్నా మంచి నాయకత్వం ఇస్తామన్న భరోసాను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు.. ఏపీలో బీజేపీ ఉనికే లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, మోసాల గురించి ప్రజలకు వివరించడంలో చంద్రబాబు పూర్తిగా సఫలమయ్యారన్నారు.. మోదీ గ్రాఫ్‌ పడిపోతున్నదని, బీజేపీకి ప్రజాదరణ తగ్గిపోతున్నదని తెలిపారు.. అదే విధంగా 2019లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, అయితే ఏ పార్టీ తరపున అనేది త్వరలో తెలియజేస్తానన్నారు.. అంతకన్నా ముందు రెండు నెలలపాటు జిల్లా అంతటా పర్యటించి, తన అభిమానుల సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు.. తరువాత ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుని వెల్లడిస్తానని హరి అన్నారు.