టీఆర్ఎస్ ఎంపీ నిర్వాకం.. ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం

 

న్యాయం చెయ్యాల్సిన నేతలే తమ ఉపాధిని కోల్పోయేలా చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. వివరాళ్లోకి వెళ్తే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిగా మారిన హన్మకొండ హంటర్ రోడ్ లో గజం నలభై వేల రూపాయల పై మాటనే పలుకుతుంది. పాతికేళ్లుగా అక్కడ ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఉండేది. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్ లో నూట యాభై మందికి పైగా కార్మికులు పని చేసేవారు. ఆ సెంటర్ ను ఇప్పుడు మూసేసి  కార్మికులను పంపేశారు. ఇపుడు ఈ స్థలం అధికార పార్టీ ఎంపీ పసునూరి దయాకర్ సొంతచేసుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్ లో ఉండే ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంట్రర్ స్థలానికి టెండర్ పెట్టి సింగిల్ బిడ్ దాఖలు చేసి ఎంపీ పసునూరి దయాకర్ దాన్ని ముప్పై మూడేళ్ళ లీజుకు దక్కించుకున్నారు. కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలన్న రాజకీయ సూత్రాన్ని అమలు చేసి ఆర్టీసీ ఆస్తులను చెరబట్టారు. 

హన్మకొండ హంటర్ రోడ్ లో దాదాపు ఇరవై ఐదేళ్ల కిందట టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది నగరానికి దూరంగా ఉండేది. అరిగిపోయిన టైర్లను తిరిగి ఉపయోగించుకునేందుకు అనుగుణంగా ఇక్కడ రీట్రేడింగ్ చేసేవారు. పరిసర ప్రాంతాలకు చెందిన ఆరు జిల్లాల్లో ఉన్న బస్సులకు చెందిన టైర్లను రిట్రేడింగ్ చేసేవారు. కాలక్రమంలో అనేక వ్యాపార సముదాయాలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. భూముల ధరలు రానురాను ఆకాశాన్నంటాయి.ఇక్కడ ఎకరం విలువ పంతొమ్మిది కోట్ల రూపాయల పై మాటే, అంటే నాలుగు ఎకరాలు కలిపి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అన్నమాట. దాంతో ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఫలితంగా అద్భుతంగా పని చేస్తున్న దశలోనే టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేందుకు ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నారు. ఇందుకు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ సెంటర్ తో ఎటువంటి ఉపయోగం లేదని దీని కారణంగా ఆర్టీసీకి అపారమైన నష్టం వస్తోందని తొలుత అధికారులు ప్రచారం చేశారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేశారు. ఆ తర్వాత ఈ భూములను తెగనమ్మడం తప్ప మరో మార్గం లేదని ప్రచారంలో పెట్టారు. ఇక్కడ పని చేసే కార్మికులను దశల వారీగా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపి పసునూరి దయాకర్ తెరమీదకొచ్చారు. ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు టెండర్ లు పిలిచారు. సింగిల్ బిడ్ తోనే ఏకంగా ముప్పై మూడేళ్లకు ఎంపీ దయాకర్ లీజుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాలకు నెలకు అయిదు లక్షల రూపాయల చొప్పున ఏడాదికి అరవై లక్షల రూపాయల అద్దె ఇచ్చేలా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. భారీ వ్యాపార సముదాయాలు మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

రీట్రేడింగ్ సెంటర్ లో భవనం ఇతర యంత్రాలు ఉన్నాయి కదా ఆ భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసేందుకు కూడా ఇటీవల టెండర్ పిలిచారు. ఈ టెండర్ కూడా పదిహేను లక్షల రూపాయలకు పసునూరి దయాకర్ దక్కటం విశేషం. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఇప్పుడు భారీ వ్యాపార సముదాయంగా మారబోతోంది. ఏకంగా మూడు మల్టీప్లెక్స్ థియేటర్ లు షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు ప్రయత్నంలో ఉన్నారు.టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దని దాన్ని ఆధునీకరించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతి నిధుల చుట్టూ తిరిగి టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను కాపాడాలని వేడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల క్రియాశీల పాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు జరిగే న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దు అంటూ రోజుల తరబడి ధర్నాలు చేశారు. అగ్రిమెంట్ ల స్థాయిలో ఉండగానే రీట్రేడింగ్ సెంటర్ కనుమరుగవుతుందని అంటూ ఉద్యమం చేపట్టారు. ఏకశిలా పార్కు ఎదురుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఇతర రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వారికి సంఘీభావం ప్రకటించాయి. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగి పోయింది. కానీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే భూదందాలు కబ్జాల నేపథ్యం లేని ఎంపీ దయాకర్ ఈ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను దక్కించుకున్నాడంటే కార్మికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంది సారూ మాకు అండగా నిలవాల్సింది పోయి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ మూసివేత వెనుక రాజకీయ నాయకులు ఉన్నారంటూ తమకు తమ ఉపాధి కోల్పోనివ్వకుండా తమకు తగిన న్యాయం చేయ్యాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు.