ప్రగతి భవన్ ముట్టడికి యత్నం.. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

 

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై మూడు పిటిషన్ లు దాఖలయ్యాయి. ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాలకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని పిటిషన్లపై ఇరవై ఎనిమిదిన వాదనలు ఉంటాయి. ఇటు ఆర్టీసీ సమ్మె, అటు కార్మికుల నిరసనలు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల సమయంలో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు కాంగ్రెస్ నేతలు. దీంతో ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు పోలీసులు. అయిన ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ప్రగతి భవన్ బాట పట్టిన కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, రాములు నాయక్ ను అరెస్టు చేశారు. బైక్ పై వచ్చి ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు యత్నించిన రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. షబ్బీర్ అలీ, విశ్వేశ్వర్ రెడ్డి సహా పలు కీలక నేతలను ఇంటికే పరిమితం చేశారు పోలీసులు. ఇటు పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డిలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. 

మరోవైపు ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో సోమాజిగూడ, బేగంపేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఓ వైపు స్కూళ్ళ రీ ఓపెనింగ్, ఇంకో వైపు బస్సుల కరువు, సొంత వాహనాలతో రోడ్లెక్కడం నిరసనలకు పిలుపు వెరసి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోటెత్తింది. ప్రగతి భవన్ దగ్గర బందోబస్తుతో సికింద్రాబాద్ రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ కన్పిస్తోంది. 

ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు ప్రభుత్వం విఛ్చిన్నం చేయాలని కుట్ర చేస్తోందన్నారు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు. కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆయన యూనియన్ లు లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల ముప్పై వ తేదీ వరకు కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళనల్లో కార్మిక కుటుంబాలు కూడా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. శనివారం ఆందోళనలో వేలు తెగిన కారణంగా హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు పోటు రంగారావు.ఇక సమ్మెలో కార్మికుల కుటుంబాలు పాల్గొని పరిస్థితి ఇంకా ఉధృక్తం కాక ముందే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే కానీ రాష్ట్రనికి  మేలు జరిగే సూచనలు కనిపించట్లేదు.