పాక్ కోడలు సానియా మీర్జా మనకొద్దు.. మనవాళ్లే ముద్దు

 

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఎఫెక్ట్ తో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కష్టాలు మొదలయ్యాయి. దాడిని భారతీయులంతా ఖండిస్తూ తీవ్ర ఆవేదన, ఆవేశం వ్యక్తం చేస్తే.. సానియా మీర్జా మాత్రం తనకేం పట్టనట్లు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో పోస్ట్ చేసింది. దీంతో సానియా మీర్జా మీద విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే దాడిని ఖండిస్తున్నా అంటూ పోస్ట్ పెట్టింది. అయినా సానియా మీద విమర్శలు ఆగలేదు. అయితే ఇప్పుడు హైదారబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓ సంచలన డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ అంబాసిడర్‌గా ఉన్న సానియా మీర్జాను వెంటనే తప్పించాలని సీఎం కేసీఆర్‌కు ఆయన విజ్ఙ‌ప్తి చేశారు. పాకిస్థాన్‌కు కోడలు కాబట్టి సానియాను అంబాసిడర్‌గా తొలగించి, ఆ స్థానంలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, లేదా వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌ను సానియా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి భారత్ - పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పాక్ కోడలైన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలనే డిమాండ్ ను రాజాసింగ్ తెరపైకి తీసుకొచ్చారు. రాజాసింగ్ మాత్రమే కాదు పలువురు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.