కన్నతల్లిని టెర్రస్ పై నుండి తోసి.. కొడుకు డ్రామా..

 

రాజ్ కోట్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లినే ఓ కసాయి కొడుకు కడతేర్చిన ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం... ఇటీవల జయశ్రీ అనే వృద్ధురాలు తాను నివసిస్తున్న భవనం పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... దర్యాప్తు చేపట్టగా...దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. ఆమె ఏదో పొరపాటున భవనం పై నుండి కింద పడిపోలేదని.. ఆమె కొడుకే ఆమెను హతమార్చాడని పోలీసులు తెలిపారు.

 

జయశ్రీ కి ఒక కొడుకు.. ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక జయశ్రీ తన భర్త చనిపోయిన తరువాత కొడుకు సందీప్‌ నతవానీ దగ్గరే ఉంటుంది. అయితే ఇటీవల ఆమె మరణించింది. ఇక సందీప్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కూడా ముందుగా ప్రమాదవశాత్తూ పడిపోయిందనే కేసు నమోదు చేసుకున్నారు. కానీ గత కొంత కాలంగా ఆమె ఆరోగ్యం బాగోటం లేదు. ఈ మధ్యే జయశ్రీకి పక్షవాతం కూడా సోకిందని.. సరిగ్గా కదల్లేని స్థితిలో ఉన్న ఆమె మేడ మీదకు ఎలా వెళ్లగలిగిందంటూ బంధువుల అనుమానం వ్యక్తం చేయడంతో అసలు కథ మొదలైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు... చివరకు అపార్ట్‌ మెంట్‌ లోని సీసీ పుటేజీల ద్వారా అసలు విషయాన్ని తేల్చేశారు. తల్లిని డాబా మీదకి తీసుకెళ్లి తోసేసినట్టు చెప్పారు.


ఇక ఈ ఆరోపణలపై వాటిని ఖండించిన సందీప్‌ ఛాతీలో నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరాడు. మేడ మీదకు తీసుకెళ్లాలని తనను తల్లి కోరిందని.. తిరిగి నీటి కోసం తాను కిందకు వచ్చేసరికి ఘటన జరిగిందంటూ అతను చెబుతున్నాడని... అతను డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకుంటామని.. పోలీసులు తెలిపారు.