మజ్లిస్‌ కంచుకోటలో కాంగ్రెస్ వ్యూహమేంటి?

 

గత ఎన్నికల వరకు మజ్లిస్‌,కాంగ్రెస్ పార్టీలకు మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండేది.కానీ కొంత కాలంగా మజ్లీస్, కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.ఈ పార్టీల మధ్య దోస్తీ తెలిగిపోయినప్పటి నుంచి వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ పరాజయం చవిచూస్తూ వచ్చింది.బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మజ్లిస్‌ బరిలోకి దిగడంతో మైనారిటీ ఓట్లు చీలి, పట్టున్న స్ధానాల్లో సైతం కాంగ్రెస్‌ ఓటమి పాలైంది.మరోవైపు బీజేపీకి లాభం చేకూరింది.దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం మజ్లిస్‌పై సీరియస్‌గా ఉంది.  తాజాగా తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం దోస్తీ కట్టటంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని జీర్ణించుకోలేకపోతోంది.ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీని దెబ్బతీసి గుణపాఠం చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా పాతబస్తీపై ప్రత్యేక వ్యూహ రచన చేస్తోంది. 

పాతబస్తీ మజ్లిస్‌కు కంచుకోట కావడంతో ఇతర పక్షాలు తలపడడం అంత సులభం కాదు. మైనారిటీలు గణనీయంగా ఉండడంతో ఓటర్లు మొత్తం ఒకవైపు మొగ్గు చూపుతారు.దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్ధాయి ముస్లిం మైనారిటీ నాయకులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది.ప్రతి అసెంబ్లీ స్థానాన్ని సీరియస్‌గా తీసుకొని ఎన్నికల బరిలోకి దూకాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్, బీజేపీ పక్షాలు దిగే అవకాశం ఉన్నప్పటికీ... కేవలం మజ్లిస్‌పైనే దృష్టిసారించింది.ఈసారి ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చార్మినార్‌లో జరిగిన రాజీవ్‌ సద్భావన యాత్ర సభలో పాల్గొని మజ్లిస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ నిప్పులు చెరిగారు.అంతకముందు రాష్ట్ర స్థాయి అగ్ర నేతలు పాతబస్తీలోని ముస్లిం కుటుంబాలతో భేటీ అయ్యారు.తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మైనారిటీ సెల్‌ నేత నదీమ్‌ జావిద్‌ మైనారిటీ నేతలతో సమావేశమై పాతబస్తీలోని రాజకీయ పరిస్ధితులపై చర్చించారు.