రాహుల్ బలే కౌంటర్ ఇచ్చాడుగా.. బీజేపీ ఎక్కువ కష్టపడొద్దు..

 

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి రాహుల్ గాంధీ కాస్త హుషారైనట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ అంటే అమూల్ బేబి, పప్పు, ఇంకా ఇలా ఎన్నో ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకునేవాళ్లు విపక్ష నేతలు. కానీ ఈ మధ్య రాహుల్ గాంధీ కాస్త రూట్ మార్చారు. ఏకంగా మోడీ పైనే ఘాటుగా విమర్శలు చేస్తూ నేను పప్పు ఏం కాదని నిరూపించారు. రాహుల్‌ ప్రసంగాలలో కాస్త పరిణతి, దూకుడు కనిపిస్తుండటంతో... రాహుల్‌ పట్ల ప్రజాభిప్రాయంలో కూడా కాస్త మార్పు వస్తోంది. ఇక అతని ట్వీట్లు ఇప్పుడు టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారుతున్నాయి. అంతేనా...ఇంతకుముందు ప్రభావవంతమైన నేతల జాబితాలో ఎక్కడో కనిపించేవాడు కాస్తా ఇప్పుడు, మోదీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు మోదీ స్థానం మాత్రం ఓ రెండడుగులు దిగజారినట్లు సర్వేలలో తెలుస్తోంది.

 

ఇక ఇప్పుడు తాజాగా మరోసారి రాహుల్ గాంధీ బీజేపీకి చురక అంటించారు. గతంలో రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకునేందుకు విదేశాలకు వెళ్లినప్పుడు రాహుల్ గాంధీ కనిపించడం లేదంటూ  పోస్టర్లు వేయడం, కామెంట్లు చేయడం చేస్తుండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ప్రతిపక్షనేతలకు ఇవ్వాలనుకోలేదు రాహుల్. అందుకే ముందుగానే బీజేపీ నేతలను ఉద్దేశించి చురకలు అంటించారు. అమ్మను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్నానని... కాబట్టి కొన్ని రోజులు అందుబాటులో ఉండనని..ఈ సందర్భంగా బీజేపీ ట్రోలింగ్ ఆర్మీకి ఒక విన్నపం చేస్తున్నానని... తనను విమర్శించడానికి ఎక్కువగా కష్టపడవద్దని, త్వరలోనే తిరిగి వస్తానని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మొత్తానికి రాహుల్ గాంధీ బాగానే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి తనపై కామెంట్లు చేసే అవకాశం ఇవ్వలేదు.