మళ్ళీ నువ్వే రావాలి.. నిజంగా ప్రజలు కోరుకుంటున్నారా?

 

గత ఎన్నికల్లో ఏపీ ప్రజల్లోకి.. ముఖ్యంగా యువతలోకి బలంగా దూసుకుపోయిన స్లోగన్ 'బాబు రావాలి.. జాబు రావాలి'. టీడీపీ కార్యకర్తల నుంచి సామాన్య ఓటర్ల వరకు అందరి నోట ఈ మాట బాగా వినిపించింది. ఏపీ ప్రజలు చంద్రబాబుని నమ్మారు.. దానికి తగ్గట్లే అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు కూడా ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ నాలుగున్నరేళ్లలో చాలా సాధించారు. ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అలాగే పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కియా మోటార్స్, టిసిఎల్ కంపెనీలు తీస్కోచ్చారు. రాయలసీమకు నీళ్లిచ్చారు. రీసెంట్ గా కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన కూడా చేసారు. గొప్ప రాజధాని నిర్మాణం కావాలన్నా, పెద్ద కంపెనీలు రావాలన్నా మళ్ళీ బాబే రావాలని టీడీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు. అందుకే గతంలో 'బాబు రావాలి.. జాబు రావాలి' అనే స్లోగన్ లాగా ఇప్పుడు 'మళ్ళీ నువ్వే రావాలి' అనే స్లోగన్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏపీ ప్రజలు నిజంగా మళ్ళీ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నారా? అంటే దాదాపు 64 శాతం మంది మళ్ళీ బాబు రావాలని కోరుకుంటున్నారట.

ఏపీలో కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మీద దృష్టి పెట్టడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు కూడా ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుంటూనే.. మరోవైపు పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేపిస్తూ గెలుపు గుర్రాలను వెతుకుతున్నారు. అయితే రీసెంట్ గా చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పెద్దలు ఒక సర్వే నిర్వహించారట. ఈ సర్వేలో డొంక తిరుగుడు లేకుండా ఒకే ఒక ప్రశ్న అడిగారట. అదేంటంటే మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలా? వద్దా?. ప్రతిజిల్లాలో దాదాపు నాలుగు వేల మందిని ఈ ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. వివిధ వర్గాలు, మతాలు, కులాలకు చెందిన వారు ఈ నాలుగు వేల మందిలో ఉన్నారట. మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలా? వద్దా? అన్న ప్రశ్నకు దాదాపు 64 శాతం మంది మళ్ళీ చంద్రబాబే సీఎం కావాలని చెప్పారట. 15 శాతం మంది చంద్రబాబు పనితీరు పర్వాలేదని చెప్పగా.. 21 శాతం మంది మాత్రం ఈ ప్రభుత్వం మారిపోవాలని కోరుకున్నారట. మొత్తానికి ఈ సర్వేతో టీడీపీ నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అయితే చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వారి శాతం ఇంకా పెరగాలని.. అప్పుడు టీడీపీ విజయావకాశాలు మరింత పెరుగుతాయని నేతలు భావిస్తున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.