41 ఏళ్ల తరువాత ..అదే భస్మాసుర "హస్తం"
posted on Feb 28, 2014 10:39AM
41 ఏళ్ల తరువాత ..అదే భస్మాసుర "హస్తం"
రాష్ట్రగతి.. రాష్ట్రపతిపాలనకు చేరింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో యుపీఏ ప్రభుత్వం రాష్ట్రపతిపాలనకే మొగ్గు చూపుతోంది. కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తరువాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడమే తరువాయి.. 41 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ లో ప్రెసిడెంట్ రూల్ అమలు కానుంది.
రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏపీలో అనిశ్చితి పరిస్తితి ఏర్పడింది. కిరణ్ రాజీనామాను అంత సీరియస్ గా తీసుకోని కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. న్యాయ సలహాలు.. పార్టీకి ఒనగూడే ప్రయోజనాలను బేరీజు వేసుకుంది. ఏపీలో ఇరు ప్రాంతాల వారిని వార్ రూంకి పిలిచి బేరాలు సాగించింది. చివరి వరకూ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే ప్రయత్నాలు చేసింది. ఏమైందో ఏమో గానీ సడన్ బ్రేక్ వేసి ప్రెసిడెంట్ రూల్ టర్న్ తీసుకుంది.
నలబై ఒక్క ఏళ్ళ కింద జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి నుంచి బయటి పడేందుకు 1973 జనవరి 11న రాష్ట్రపతి పాలన విధించారు. విచిత్రంగా నాలుగు దశాబ్దాల తరువాత తెలంగాణా, సమైక్యాంద్ర ఉద్యమాలతో ఏపీలో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి. మళ్ళీ అదే విధంగా రాష్ట్రపతి పాలన విధించనున్నారు.
అప్పుడు...ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండడం విశేషమే కాదు... విచిత్రం కూడా. తమ ప్రభుత్వాలున్న చోటే తప్పనిసరై ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరా, నేడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ (సోనియాగాంధీ అనుమతితో) ప్రెసిడెంట్ రూల్ కు సిఫారసు చేసారు. జై ఆంధ్ర ఉద్యమానికి తెలంగాణా ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు రాజీనామా చేస్తే .. నేడు తెలంగాణా ఉద్యమ ఉదృతికి సీమాంధ్రకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. నాడు..నేడు తమ సొంత రాష్ట్ర ప్రభుత్వాలపై భస్మాసుర "హస్తం" మోపి రాష్ట్రపతిపాలనకు విధించిన ఘనత మళ్లీ కాంగ్రెస్సే దక్కించుకుంది.