కవిత ఓటమి వెనుక ప్రశాంత్ కిషోర్ టీం !!
posted on Jun 19, 2019 6:15PM
2014 లోకసభ ఎన్నికలలో నరేంద్ర మోడీ గెలుపు కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా జరిగిన ఎపి అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి విజయం లో కీలక పాత్ర పోషించారు. అయితే అదే పీకే పై ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. తెలంగాణ లో మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలలో నిజామాబాద్ నుండి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి కోసం ఇదే పీకే టీం వర్క్ చేసినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఢిల్లీ లోని కొందరు పెద్దలు మరియు పీకే కు సన్నిహితుల సూచనలతో అనధికారికంగా ఒక టీం నిజామాబాద్ లో బిజెపి అభ్యర్థి అరవింద్ గెలుపు కోసం రెండు నెలలు పని చేసిందట! కవిత ఓటమికి పూర్తిగా పీకే టీం కారణమని చెప్పలేము కాని ఈ ఫ్యాక్టర్ కూడా పని చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో విచిత్రమేమిటంటే ఇదే పీకే టీం ను తెలంగాణ లో టిఆర్ఎస్ గెలుపు కోసం పని చేయాలని కేటీఆర్ అప్రోచ్ అయ్యారట, కానీ ఎందుకో ఆ డీల్ కుదర లేదని తెలుస్తోంది.