ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం.. స్పీకర్‌గా పోచారం!!

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ గన్‌పార్కు‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి నేరుగా గన్‌పార్కు‌ వద్దకు చేరుకున్న కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అమరవీరులకు నివాళి అర్పించారు. కేసీఆర్ తో పాటు హోం మంత్రి మహమూద్‌ అలీ, హరీష్ రావు, ఈటల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు అమరవీరులకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం నేతలంతా అసెంబ్లీకి చేరుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11.30గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత సీఎం కేసీఆర్‌ .. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నారు. అదేవిధంగా స్పీకర్‌ ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్‌ వెలువడనుంది. స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.