పీఎన్‌బీ స్కాంపై ప్రధాని నోరుమెదపరేం..?

భారతీయ బ్యాంకింగ్ రంగానికి షాకిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడటం లేదని... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మోసం ఎందుకు జరిగిందో వివరించాలని.. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాయాలో చెప్పడానికి ప్రధాని గంటన్నర సమయాన్ని వెచ్చించడానికి బదులుగా నీరవ్ మోడీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..? దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కలిగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న సంగతిని దేశప్రజలకు ఆయన వివరించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కుంభకోణంపై మాట్లాడాల్సింది ఆర్థికమంత్రి, ప్రధానమంత్రులు కానీ.. రక్షణ, సామాజిక న్యాయశాఖ మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని రాహుల్ ప్రశ్నించారు.