పాకిస్థాన్ కు బంపరాఫర్ ఇచ్చిన మోడీ..
posted on Jan 18, 2017 9:26AM
భారత్-పాక్ దేశాల మధ్య ఎప్పుడో జరగాల్సిన ధ్వైపాక్షిక చర్చలు ఇంతవరకూ జరగనేలేదు. పాక్ ఉగ్రవాదులు దాడి జరపడం దానికి ప్రతీకారంగా సర్జికల్ దాడులు జరపడం.. దానికి పాక్ సరిహద్దు ప్రాంతంలో రోజూ కాల్పులు జరపడం.. దీంతో రెండు దేశాల మధ్య జరగాల్సిన చర్చలు కాస్త మరుగునపడ్డాయి. అప్పటినుండి రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇక రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో చేసిన సర్వేలో కూడా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. చాలా వరకూ రెండు దేశాల మధ్య చర్చలు జరిగితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అయితే ఇప్పుడు రెండు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్ కు ఓ బంపరాఫర్ ఇచ్చారు. పాకిస్థాన్ దేశం ఉగ్రవాదాన్ని వదిలి వేయడంతో పాటు, దానిని పూర్తిగా నిర్మూలించినప్పుడే ఇరు దేశాల మధ్య సమస్యలను చర్చించేందుకు సిద్ధమవుతామని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఢిల్లీలో రెండో ‘రైజినా డైలాగ్’ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత్ తరపున తాను లాహోర్ వరకు వెళ్లి వచ్చానని, అయితే, శాంతిని నెలకొల్పేందుకు భారత్ మాత్రమే పూనుకుంటే సరిపోదని, పాక్ కూడా ఆ బాటలో నడవాలని అన్నారు. ఎవరైతే సీమాంతర ఉగ్రవాదాన్ని, అహింసను ప్రోత్సహిస్తారో వారిని ఒంటరిని చేయాలని సూచించారు.