జీఎస్టీ దెబ్బకు వ్యాపారి బలి

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీఎస్టీ విధానంతో చిన్న,మధ్యతరహా పరిశ్రమలు తుడిచిపెట్టుకుపోయాయి.జీఎస్టీ కట్టకపోతే విధించే జరిమానాలు కూడా భారీగానే ఉన్నాయి.తాజాగా జీఎస్టీ కారణంగా ఓ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు.కృష్ణా జిల్లాలోని పెనమలూరు మార్కెట్‌ మాజీ డైరెక్టర్‌ మహ్మద్‌ సాదిక్‌ ప్రార్థన మందిరానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లినవాడు తిరిగి రాలేదు.దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఆయన మృతదేహాన్ని కరువు కాల్వలో తోట్లవల్లూరు ప్రాంతంలో పోలీసులు గుర్తించారు.

కుటుంబ సభ్యులు మాత్రం సాధిక్ ఆత్మహత్యకు ఆదాయ పన్ను శాఖ అధికారులే కారణమని ఆరోపిస్తున్నారు. సాధిక్ 25 ఏళ్లుగా విజయవాడలోని ఆటోనగర్‌లో లారీలకు బాడీ బిల్డింగ్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జీఎస్టీ అమల్లోకి రాకముందు వరకు ఈ వృత్తి చేతి వృత్తుల్లో ఒకటి. ఇప్పుడు ఇక్కడ తయారయ్యే ప్రతీ వస్తువుపై జీఎస్టీ విధిస్తున్నారు. సాధిక్ కొద్దినెలలుగా ఐటీరిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో ఆ శాఖ అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన ఓ చాటెడ్ అకౌంటెంట్‌ను ఆశ్రయించారు. జీఎస్టీ నుంచి మినహాయింపు పొందేలా రిటర్న్స్ రూపొందించారు. బాడీ బిల్డింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న ఐదారుగురు కార్మికులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు చూపించారు. ఐటీ అధికారులు ఈ ఐదుగురిని విచారించగా వారు కార్మికులే అని తేలింది. దీంతో సాధిక్‌కు ఐటీ అధికారులు రూ.50లక్షల జరిమానా విధించారు. ఐటీ అధికారులను వేడుకోగా కేసు లేకుండా చేసేందుకు తమకు కొంత డబ్బు ఇవ్వాలని అధికారులు, సాదిక్‌ను డిమాండ్‌ చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, వ్యక్తిగత సమస్యలు తోడవడంతో కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు.పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరోవైపు సాధిక్‌కు జీఎస్టీ నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని జీఎస్టీ ఉన్నతాధికారులు తెలిపారు. తమ జాబితాలో సాధిక్ పరిశ్రమలేదని, నోటీసులతో తమకు సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు.