చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
posted on Jan 11, 2019 5:05PM
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మండిపడ్డారు. చింతమనేని ప్రభాకర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నేతలతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చింతమనేని ఇబ్బంది పెడుతున్నారని దళితులు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారన్నారు. అలాంటి వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని విమర్శించారు. జనసేన సమాజం కోసమే పనిచేస్తుంది తప్ప కులం పేరుతో ప్రజలను విడగొట్టదని వ్యాఖ్యానించారు. రాత్రికి రాత్రే పార్టీ నిర్మాణం సాధ్యం కాదని, త్వరలో పార్లమెంట్ స్థాయిలో కమిటీలు వేస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరితోనైనా గొడవపెట్టుకుంటానని పవన్ హెచ్చరించారు.