పవన్ పై బాబు ఫైర్...ఎదురుదాడికి దిగండి..
posted on Mar 15, 2018 10:57AM
మొత్తానికి ఇన్ని రోజులకు ప్రతిపక్షనేతలు హ్యాపీగా ఫీలయివుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మామీదే విమర్శలు చేస్తుంటాడు తప్పా.. ? టీడీపీ ని ఒక్క మాట కూడా అనడు... చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ అంటూ అనుకునే వాళ్లు. ఇప్పుడు అలా అనుకున్నవాళ్లకి పవన్ మాటలు సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ టీడీపీకి మద్దతుగా ఉన్న పవన్ ఒక్కసారిగా టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడితో సహా టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడేక్కాయి.
ఇదిలా ఉండగా.. టీడీపీపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అనంతరం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి కేంద్రాన్ని నిలదీసి డిమాండ్లను సాధించుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో చౌకబారు విమర్శలు చేయడంలో అర్థమేంటని ప్రశ్నించారు. కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామాలు కూడా చేసి, నిత్యమూ పార్లమెంట్ వేదికగా పోరాటం సాగిస్తుంటే ఈ తరహా విమర్శలు ఏంటని అన్నారు. అంతేకాదు....పవన్ కల్యాణ్ విమర్శల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని.. ఓ పథకం ప్రకారం బుదరజల్లే ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు. నరేంద్ర మోదీ తన భుజాలపై ఓకవైపు పవన్ ను, మరోవైపు జగన్ ను మోస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. తన ప్రసంగంలో ఒక్కసారైనా ప్రధాని నరేంద్ర మోదీ పేరునైనా తలవని పవన్, లోకేష్ పై ఆరోపణలు చేయడం బాధను కలిగించిందని అన్నారు. ఆయన విమర్శలు, ఆరోపణలపై ఎదురుదాడికి దిగాలని, అయితే, ఆయన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని మాత్రం ఎటువంటి విమర్శలూ చేయవద్దని సూచించినట్టు సమాచారం.. మరి టీడీపీ విమర్శలను పవన్ తట్టుకుంటాడా...లేకపోతే తిరిగి టీడీపీపై మళ్లీ విరుచుకుపడతారా..? చూద్దాం ఏం జరుగుతుందో..