మనుషులు పోయినందుకు కాదు బాధ

 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి వరుసగా దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. రెండు నెలల క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం బొద్ గయలో బాంబులు పేల్చిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు, మళ్ళీ మొన్న నరేంద్ర మోడీ పాట్నాలో జరిపిన సభకి ముందుగా బాంబులు పేల్చడం, దానిలో ఆరుగురు చనిపోవడం, అనేకమంది తీవ్రంగా గాయపడటంతో, నితీష్ కుమార్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో తరచు విఫలం అవుతున్నారని విమర్శలు మొదలయ్యాయి.

 

ముఖ్యంగా తనకి బద్దశత్రువయిన మోడీ, తన బీహార్ రాష్ట్రం లో సభ పెట్టుకొంటునపుడు, ఉగ్రవాదులు ఏకంగా సభా ప్రాంగణంలోనే ప్రేలుళ్ళకు పాల్పడటంతో శాంతి భద్రతల విషయంలో ఆయన వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఆయన సంస్కరణలు, అభివృద్ధి పట్ల చూపుతున్నంత శ్రద్ద, శాంతి భద్రతల విషయంలో చూపడం లేదని, రాష్ట్ర పోలీసు, నిఘా వ్యవస్థలపై ఆయనకు సరయిన పట్టు లేకపోవడంతో వలననే తరచు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

ఇక కొద్ది నెలల క్రితం బీహార్ లో శరన్ అనే ప్రాంతంలో చిన్నారులు స్కూలులో విషాహారం తిని మృతి చెందిన కేసు నేటికీ పరిష్కరింపబడలేదు. ఏదయినా ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే, నితీష్ కుమార్ ముందు విచారణకు ఆదేశించడం, ఆ వెంటనే భాదిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం తప్ప, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మాత్రం ఆయన చూడలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

అయితే ప్రతీ రాష్ట్రంలో ఇటువంటి వ్యవహారాలు తరచు జరుగుతూనే ఉన్నపటికీ, ఆయన అటు ఎన్డీయే కూటమితో కటీఫ్ చేసుకొని, ఇటు యూపీయే కూటమిలోని జేరకపోవడంతో ఆయనకి ఎవరి మద్దతు లేకపోగా అందరు ఆయనపై దాడి చేసేందుకు చేజేతులా అవకాశం కల్పించుకొన్నారు.

 

ఒకవేళ ఆయన పార్టీ జేడీ(యూ) నేటికీ ఎన్డీయే కూటమిలో ఉండి ఉంటే, స్వయంగా బీజేపీయే ఆయనని వెనకేసుకు వచ్చేదేమో. అదేవిధంగా ఎన్డీయే కూటమి నుండి తప్పుకొని చాల కాలం అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపకపోగా ఇప్పుడు ఇంకా ఏర్పడని మూడో ఫ్రంటుతో జత కట్టాలని ఆలోచిస్తుండటంతో, సహజంగానే కాంగ్రెస్ కూడా ఆయన వైఫల్యాన్నిఎండగడుతోంది. మోడీ సభకి ఉగ్రవాదుల బెడద ఉంటుందని తాము ముందే హెచ్చరించినా కూడా, నితీష్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, తత్ఫలితంగా అమాయకులయిన ప్రజల ప్రాణాలు పోయాయని కాంగ్రెస్ దుమ్మెతి పోస్తోంది.

 

అయితే ప్రజలు చనిపోయారనే బాధకంటే , ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడిన నరేంద్ర మోడీ సభలో ఇటువంటి సంఘటన జరగడం వలన కేంద్ర రాష్ట్రాలు రెండూ ఆయన సభకు తగిన భద్రత కల్పించడంలో వైఫల్యం చెందాయని, ఆయనకు తగిన రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం వహించి ఆయన ప్రాణాలకే ప్రమాదం తెస్తున్నాయని, రేపటి నుండి బీజేపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, నితీష్ కుమార్ ప్రభుత్వాలపై అస్త్రాలు సందిస్తే దానికి వారిరువురి వద్ద జవాబు ఉండదు.

 

అది బీజేపీకి సానుభూతి ఓట్లను కురిపించవచ్చని గ్రహించిన కాంగ్రెస్, నితీష్ కుమార్ ప్రభుత్వాలు “మీది తప్పంటే మీదే తప్పని” ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టారు.