నేడు బడ్జెట్ సమావేశాల చివరి రోజు...ఎంపీల రాజీనామా.. ఆమరణ దీక్ష

 

దాదాపు మూడు వారాలకు పైగా సాగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ ఎంపీలందరూ అవిశ్వాస తీర్మానం పెట్టి.. ఇన్నీ రోజుల నుండి ఆందోళన చేస్తున్నా.. కనీసం ఒక్కరోజు కూడా అవిశ్వాసంపై చర్చ జరగలేదు. రిజర్వేషన్ల కోటాను నిర్ణయించుకునే బాధ్యత రాష్ట్రాలకే ఇవ్వాలంటూ తెలంగాణ, కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే నేతలు వెల్ లో నినాదాలు చేస్తుండటంతో, సభ నిత్యమూ వాయిదా పడుతూ వచ్చింది. ఇక చివరి నాలుగైదు సెషన్ లలో టీఆర్ఎస్ ఎంపీలు వెల్ లో కాలుపెట్టకపోయినా, అన్నాడీఎంకే నిరసనలు కొనసాగడంతో  అవిశ్వాస తీర్మానం చర్చకే రాలేదు. కానీ ఎంపీల నిరసనల మధ్య తమకు కావాల్సిన కీలక బిల్లులను మాత్రం కేంద్రం ఆమోదింపజేసుకుంది.

 

ఇక ఈరోజుతో సమావేశాలు ముగియనుండటంతో.. మరో సరికొత్త హైడ్రామా మొదలయింది. లోక్ సభ నిరవధిక వాయిదా పడగానే వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాజీనామాలు చేసిన అనంతరం... ఏపీ భవన్ కు వెళ్లి అక్కడ ఆమరణ దీక్షను ప్రారంభించనున్నట్టు సమాచారం.