ఆప్కాస్‌ ను ప్రారంభించిన సీఎం జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్(ఆప్కాస్)‌ను సీఎం వైఎస్ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలు, సమస్యల గురించి తెలుసుకున్నానని అన్నారు. అందుకే వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారని, కానీ ఆ వ్యవస్థను మార్చి నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలనే చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ఎవరికీ లంచాలు ఇవ్వనవసరంలేదని, 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మహిళలకే ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు చైర్మన్ లు గా ఉండి ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను పర్యవేక్షిస్తారని అన్నారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులుగా నియమితులైన వారికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ విధానంలో లంచాలు, కమీషన్ కు తావులేనందున ఉద్యోగికి పూర్తి జీతం చేతికి అందుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.