ప్రగతిభవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు అరెస్ట్
posted on Aug 13, 2020 3:12PM
త్వరలో తెలంగాణాలో ఎంట్రెన్స్ పరీక్షలు కండక్ట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 37మంది ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని కోరుతూ ఈ ముట్టడి చేసారు. తాజాగా ఈ కేసులో కేసీఆర్ మనవడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ముట్టడిలో సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కొడుకు రితేష్ రావు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రితేష్ రావును పోలీసులు ఈ కేసులో ఏ5 గా చేర్చారు. దీంతో అతడిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14రోజుల రిమాండ్ విధించడంతో అందర్నీ చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఐతే ఈ అరెస్ట్ పై సీఎం కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ పార్టీ నేత రమ్యారావు మండిపడ్డారు. ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు ఉద్యమం చేసింది ఆస్తుల కోసమో, కమిషన్ల కోసమో కాదని.. కేవలం విద్యార్థుల ప్రాణాలను కాపాడలనే ఏకైక ఉద్దేశంతోనే వారు ఆందోళన చేశారన్నారు.