అక్రమ ఇసుక తవ్వకాలు జరగలేదు.. టీడీపీకి వైసీపీ సర్కార్ క్లీన్ చిట్!!

 

గత ఐదేళ్లల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఇసుక తవ్వకాలతో కొందరు టీడీపీ నేతలు కోట్లు సంపాదించారని.. వైసీపీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి వైసీపీ ప్రభుత్వం ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు జరగలేదని టీడీపీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఏపీలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదని.. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ.. ఏపీలో టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు.. కొంత మంది ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దానిపై ఎన్జీటీ విచారణ జరుపుతోంది. ఎన్నికల సమయంలో రూ.వంద కోట్ల జరిమానా కూడా విధించింది. అయితే ఏపీ సర్కార్ కోర్టుకు వెళ్లి జరిమానాపై స్టే తెచ్చుకుంది. మరో సారి ఆ ఫిర్యాదులపై విచారణ జరుగుతుండగా.. ఏపీ సర్కార్ గత సర్కార్ హయాంలో కృష్ణానది తీరంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగలేదని వాదన వినిపించింది. జల రవాణా కోసం ప్రకాశం బ్యారేజీ వద్ద పూడిక తీశామని మాత్రం.. తెలిపింది. ఏ ప్రాతిపదికన పూడికతీత చేపట్టారు.. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? అని ఏపీ తరపు న్యాయవాదిని ఎన్జీటీ ప్రశ్నించింది. అయితే.. పూడికతీతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. వాదనలు విన్న ఎన్జీటీ… రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.