పోలవరం వివాదంపై నవయుగ పిటిషన్.. జగన్ కు షాక్ తగలనుందా?

 

పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టును రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రివర్స్ టెండరింగ్ కి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఈ ప్రాజెక్టును చేపడుతున్న నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం హెడ్‌వర్క్స్‌, జలవిద్యుత్ కేంద్రం పనులను కొనసాగించడంతో పాటు ఈ కాంట్రాక్టును మరెవరికీ కేటాయించకుండా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్ లో కోరింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం కారణంగా తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతుందని, తమ సంస్థ ప్రతిష్ఠకు అంతర్జాతీయంగా భంగం కలుగుతుందని నవయుగ ఆవేదన వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషన్ లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం దురుద్దేశంతోనే తమ కాంట్రాక్టును రద్దుచేసిందని ఆరోపించింది. దీంతో ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.