మీ పంచాయితీల కోసం ప్రజా ధనం వృధా చెయ్యడం ఏంటి జగన్ గారు?

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకి లేఖ ఇవ్వడానికి వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల కోసం ఏనాడూ ఢిల్లీ వెళ్ళని నేతలు.. ఇలా సొంత పనుల కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లడం ఏంటంటూ టీడీపీ నేత నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ఆ మధ్య సెర్బియా పోలీసులు నిమ్మగడ్డ ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్న విషయాన్నీ ప్రస్తావించిన లోకేష్.. ఆ విషయమై అప్పుడు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు సొంత పనికోసం ఏకంగా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్తున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా లోకేష్ విమర్శలు గుప్పించారు.

"కేంద్రానికి మొదటి లేఖగా, సెర్బియా పోలీసులు చేతిలో చిక్కుకున్న సహా నిందితుడిని విడిపించమని ఉత్తరం రాసారు. ఇప్పుడేమో, మీ పార్టీ సమస్య కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు. ఏ రోజు అయినా, కేంద్రం నుంచి రాబట్టే నిధులు కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ, పోలవరం కోసం కానీ ఇలా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళారా ? మీ పంచాయితీల కోసం ప్రజా ధనం వృధా చెయ్యడం ఏంటి వైఎస్ జగన్ గారు?" అంటూ లోకేష్ ధ్వజమెత్తారు.