జగన్ గారి పబ్లిసిటీ పిచ్చి తప్ప మహిళలకు న్యాయం ఎక్కడ?

వైఎస్ జగన్‌ పాలనలో గిరిజనులకు రక్షణ లేకుండాపోతోందంటూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 15 నెలల పాలనలో 400 అత్యాచార ఘటనలు జరిగాయి. 21 రోజుల్లో న్యాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. దిశ చట్టం, ఈ-రక్షా బంధన్ అంటూ వైఎస్ జగన్ గారి పబ్లిసిటీ పిచ్చి తప్ప క్షేత్రస్థాయిలో మహిళలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. కర్నూలు జిల్లాలో భర్త ముందే ఒక ఎస్టీ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

కేసు నమోదు చెయ్యడానికి గిరిజన సంఘాలు ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, బాధిత మహిళలకు జగన్ రెడ్డి గారి పాలనలో ఎంత అన్యాయం జరుగుతోందో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని లోకేష్ డిమాండ్ చేశారు.

కాగా, కర్నూలు జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు భర్తతో కలిసి గాలేరు వంతెన వద్ద నిద్రిస్తుండగా ముగ్గురు యువకులు ఆమె భర్తపై దాడిచేసి, ఆమెను ముళ్ల పొదల్లోకి ఈడ్చుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ కేసుపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని బాధితురాలి భర్త, బంధువులు ఆరోపిస్తున్నారు.