జగన్ అలా చేస్తే ఫ్రైడే కోర్టుకు వెళ్లే ఇబ్బందులు ఉండవట

 

ఏపీలో టీడీపీ వైసిపిల మధ్య ట్విట్టర్ వార్ ముదురుతోంది. విజయ సాయి రెడ్డి విలేజ్ వాలంటీర్ల వేతనాల విషయం పై లోకేష్ ను టార్గెట్ చేయగా తాజాగా మాజీ మంత్రి లోకేష్ సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ వంద రోజుల పాలనపై తీవ్ర విమర్శలు చేయడంతోపాటు.. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు గురించి కూడా అయన తన ట్విట్ లో ప్రస్తావించారు. 

‘‘తుగ్లక్ 2.0  @100డేస్..  తుగ్లక్ గారి పాలనలో ధర్నాచౌక్ ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం డల్... అమరావతిని ఎడారి చేసారు, పొలవరాన్ని మంగళవారంగా మార్చారు. 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారు. ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదు.’’ అంటూ విమర్శించారు.

‘‘ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు. పేద ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారు. ఈమాత్రం దానికి వందరోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా! ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే !! ’’ అని రెండో ట్వీట్ లో విమర్శించారు. 

‘‘తుగ్లక్ 2.0 సమస్యకి పరిష్కారం జగన్ గారూ !  రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, హైదరాబాద్ రావడం ఖర్చుతో కూడుకున్నది అని కోర్టుకి కహానీలు ఎందుకు చెప్పడం, దోచుకున్న లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకి అప్పగిస్తే సరిపోలా !!  రాష్ట్ర  ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఖజానా నిండుతుంది. అంతే కాకుండా,  మీరు  ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడానికి అయ్యే భద్రత, రవాణా ఖర్చులకి, ప్రభుత్వానికి నిధులు కూడా సమకూరుతాయి. ఇంత సులువైన పరిష్కారం ఉండగా మినహాయింపు ఎందుకు మాస్టారు. శిక్ష ఎలాగో తప్పదుగా !’’ అని మూడో ట్విట్ లో  రెచ్చిపోయారు.