డీజీపీ దొరా.. తాడేప‌ల్లి కొంపలో జగన్ మీకు భోగి ప‌ళ్లేమైనా పోశారా?

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని, దాడుల గురించి కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని తెలిపారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

 

కాగా, డీజీపీ వ్యాఖ్యలను టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. విగ్ర‌హాలు ధ్వంసం చేసింది దొంగ‌లు, పిచ్చోళ్ల‌ని నిన్న చెప్పిన డీజీపీ దొరా.. నేడు రాజ‌కీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది! అని ప్రశ్నించారు. రాత్రికి తాడేప‌ల్లి కొంపలో వైఎస్ జగన్ మార్క్ భోగి ప‌ళ్లేమైనా మీకు పోశారా అని ఎద్దేవా చేశారు.

 

మీరు విడుద‌ల‌ చేసిన జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన‌ వైసీపీ నేత దామోదర్ రెడ్డి పేరు లేదేం?.. ఓంకార క్షేత్రంలో అర్చ‌కుల‌ను చిత‌క్కొట్టిన వైసీపీ నేత ప్రతాపరెడ్డి పేరు ప్ర‌స్తావించ‌లేదెందుకు?.. ఆంజ‌నేయుడు చేయి విరిగితే ర‌క్త‌మొస్తుందా? రాముడి తల తెగితే విగ్ర‌హం ప్రాణం పోతుందా? అని హిందుత్వంపైనే దాడికి దిగిన బూతుల‌ మంత్రి నానిపై కేసు ఎందుకు పెట్ట‌లేదు? అని డీజీపీపై నారా లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.

 

హిందుత్వం మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నించేలా దాడులు జ‌రుగుతుంటే.. నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం చేత‌కాక చేవ‌చ‌చ్చిన మీపై ముందు కేసుపెట్టాలి అని విరుచుకుపడ్డారు. త‌ప్పుడు స‌మాచారంతో రాష్ట్ర ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నందుకు కోర్టులు మీపై సుమోటోగా కేసు న‌మోదు చేయాలి అని లోకేష్ వ్యాఖ్యానించారు.