జగన్‌ను తిట్టానని..నన్ను చంపుతామంటున్నారు..!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలో ప్రచార గడువు ముగుస్తుండటంతో ఇరు పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో టీడీపీ తరపున ప్రచారానికి వచ్చిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ తనదైన పంచ్‌ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే రోజాపై విరుచుకుపడ్డారు. దీంతో ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయట..కొంతమంది వైసీపీ కార్యకర్తలు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ..వేణుమాధవ్ కర్నూలు పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 19న 2 గంటల సమయంలో తనకి ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషించారని..  అంతేకాకుండా రాజశేఖర్‌రెడ్డి అనే కార్యకర్త తనను దూషిస్తూ 10 నిమిషాల నిడివి గల వీడియోని యూట్యూబ్‌లో పెట్టాడని..నిన్న కూడా మరో వ్యక్తి వీడియో అప్‌లోడ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరికొందరైతే నంద్యాల వదిలి వెళ్లకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని..వారిపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.