బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ.. కేసు నమోదు

టాలీవుడ్ ప్రముఖ నటుడు,  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ అకౌంటెంట్ ఫోర్జరీ చేశారు. బంజారాహిల్స్ లోని హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ బ్రాంచ్ లో ఈ పోర్జరీ జరిగింది. అయితే బ్రాంచ్ లో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం వసుంధర సంతకాన్ని అకౌంటెంట్ కొర్రీ శివ ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ బంజారాహిల్స్ బ్రాంచ్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ ఈ నెల13న ఆమె ప్రతినిధి సుబ్బారావుకు ఫోన్ చేసి వసుంధర మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమె అకౌంట్ నెంబరు కూడా చెప్పి అకౌంట్ ను యాక్టివేట్ చేయమంటారా? అని ప్రశ్నించారు. తాము మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని.. అసలు దరఖాస్తే చేసుకోలేదని చెబుతూ ఈ విషయాన్ని ఆమె తరఫు వ్యక్తి వసుంధర దృష్టికి తీసుకువెళ్లారు.

అయితే ఈ విషయాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నారు. తాను ఎలాంటి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారులను విచారించగా కొత్తగా వచ్చిన అకౌంటెంట్ కోర్రిశివ ఈ మధ్య వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇచ్చినట్టుగా తేలింది. దీనిపై శివను నిలదీయగా మొబైల్ బ్యాంకింగ్ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తు చేసుకున్నట్లుగా అంగీకరించారు. కాగా కోర్రి శివపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.