కోడెల సేవలు చరిత్రలో నిలిచిపోతాయి: బాలకృష్ణ

డా.కోడెల శివప్రసాద రావు మొదటి వర్థంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు.

 

నేడు కోడెల శివ ప్రసాద రావు మొదటి వర్థంతి సందర్భంగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో దివంగత నేత సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తో పాటు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోడెల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిచారు.

 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. స్వర్గీయ డా. కోడెల శివ ప్రసాద రావు తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి సమాజానికి సేవ చేయాలన్న పడ్డ తపన, చేపట్టిన కార్యక్రమాలు ఆయనను చిరస్మరణీయునిగా మిగిల్చాయని గుర్తు చేసుకొన్నారు. నిబద్దత కలిగిన కార్యకర్తగా, నాయకునిగా తన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రాభివృద్దిలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ స్థాపన లోనూ కోడెల సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, అటువంటి మహనీయుల ఆశయాలను కొనసాగించాల్సిన భాద్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మొదటి వర్థంతి సందర్భంగా కోడెల కుటుంభ సభ్యులకు బాలకృష్ణ ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన రోగులు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర సిబ్బందికి బాలకృష్ణ అన్నదానం చేశారు.