కూటమి అభ్యర్థి పై దాడికి యత్నం..టీఆర్ఎస్ అభ్యర్థి వివరణ
posted on Dec 6, 2018 9:18AM
నిర్మల్ లో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి ఇంటి దగ్గర అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కొందరు దుండుగుల మహేశ్వర్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారిని అడ్డుకున్న ఇద్దరు కార్యకర్తలపై దుండగులు కత్తితో దాడి చేశారు. చివరకు కార్యకర్తలు వెంబడించడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. టీఎస్-18ఏ 8888 కారులో దుండగులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి భౌతిక దాడులు చేయిస్తున్నారని, ఇది ఇంద్రకరణ్రెడ్డి బంధువుల పనే అని మునిసిపల్ చైర్మన్ అప్పాల గణేష్ ఆరోపించారు.
కాగా ఆరోపణలపై టీఆర్ఎస్ నేత,ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. నిర్మల్ లో గొడవలకు మహేశ్వర్రెడ్డే కారణమని,ఓటమి ఖాయం అని తేలడంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నా తాము సంయమనం పాటిస్తున్నామని, పోలీసుల విచారణలో వాస్తవాలు తెలుస్తాయని ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.