ప్రధాని కావాలని జగన్ ఆశ?
posted on May 12, 2021 3:00PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశానికి ప్రధాని కావాలని ఆశపడుతున్నారా?ఆ దిశగా ఆయన పావులు కదుపుతున్నారా? అంటే అవుననే అంటున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కు ప్రధానమంత్రి కావాలని ఉందన్నారు రఘురామ కృష్ణంరాజు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కూడగట్టిన డబ్బులతో ప్రధానమంత్రి కావాలన్న ఆయన కోరికను పైనున్న దేవతలు, ఆయన నమ్మిన క్రీస్తు కూడా హర్షించరని చెప్పారు. రెడ్డి క్యాస్ట్ను మరోసారి ఎత్తి చూపిన రఘురామ... వైఎస్సార్ కులంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘మీకు మీరే అనేసుకుంటే సరిపోతుందా? నీ బాబు... నీ అమ్మ కులం సర్టిఫికేట్లలో కాపు అని ఉంటే... రెడ్డి ఎలా అవుతారు? ఇప్పుడు సర్టిఫికేట్లు మార్చుకుని రెడ్లు.. రెడ్లు అనుకుంటే నీ తండ్రి కులం, తల్లి కులం కానిది నీకెలా వచ్చిందిరా రెడ్డి? వైఎస్ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్లో కాపు ఉంటే... జగన్ ‘రెడ్డి’ ఎలా అవుతాడురా.. కాపే అవుతాడు’’ అన్నారు రఘురామ కృష్ణం రాజు.
ఏపీలో కరోనా బాధితులకు చాలా అన్యాయం జరుగుతోందని రఘురామ విమర్శించారు. ఆస్పత్రుల్లో జరుగుతున్న అన్యాయాలను పట్టించుకునేవారు లేరని, సీఎం జగన్ నిర్లక్ష్యంవలనే 46 మంది చనిపోయారని ఆరోపించారు. మన తప్పు కానప్పటికి మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రఘురామ మండిపడ్డారు. సీఎం తన జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడంకాదని.. జగన్పై కేసు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి దొంగ లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుంటే రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టకుండా కర్ఫ్యూ పెట్టడమేంటని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల ప్రాణాలు, శవాలతో వ్యాపారం చేయడం సరికాదని రఘురామ కృష్ణంరాజు హితవుపలికారు.
వైసీపీ నేతలపై ఎంపీ రఘురామ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. తనను విమర్శిస్తున్నవారికి కౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటానని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన రచ్చబండలో వైసీపీ నేతలను విరుచుకుపడ్డారు రఘురామ. ‘పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్ అన్నట్టు గిల్లితే గిల్లుంచుకోవాలా? వాయిస్ వినిపించకూడదా? ఆపండ్రా... ఈ ఎదవ చెత్త’’ అని రఘురామ కృష్ణం రాజు మండిపడ్డారు.