ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై విరుచుకు పడ్డ వైసిపి ఎంపీ

ఏపీలో జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేసారు. రాష్ట్రంలోని వాలంటీవర్ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ పొగుడుతున్నాయంటూ మన పార్టీ నేతలు మాత్రమే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని అయన అన్నారు. ఐతే మరి నిజంగా వాలంటీర్లు అంత అద్భుతంగా పని చేస్తే... మరి కరోనా కేసులు ఎందుకు అంతగా పెరుగుతున్నాయని అయన ప్రశ్నించారు. చివరికి స్మశానాల్లో కూడా కరోనా టెస్టులు చేసేంత దారుణమైన పరిస్థితులు ఎందుకు దాపురించాయని అయన ప్రశ్నించారు. కరోనా విషయంలో మొత్తంగా చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అయన విమర్శించారు.

 

తాడేపల్లిలో ఉన్న కోవిడ్ సెంటర్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని రఘురామరాజు తెలిపారు.అంతే కాకుండా కరోనాను అసలు పట్టించుకోకుండా... ఎంత సేపు విశాఖకు వెళ్లే అంశంపైనే ఆలోచిస్తున్నారని అయన మండి పడ్డారు.ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే అసలు ఏపీలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోకుండా ఫ్రాంక్లిన్ సంస్థ ఎలా కితాబిచ్చిందో తనకు అర్థం కావడం లేదని అయన అన్నారు. ఇదే ఫ్రాంక్లిన్ వార్తను సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం మరింత విడ్డూరంగా ఉందని కూడా అయన అన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం ఊరు, పేరు లేని లిక్కర్ బ్రాండ్లను ప్రజలలోకి తెచ్చి జనం ప్రాణాలు తీస్తున్నారని అయన మండిపడ్డారు. అంతే కాకుండా మద్యం ధరలను భారీగా పెంచడం వల్ల కొత్తగా ప్రజలు శానిటైజర్లు తాగి చనిపోతున్నారని అయన అన్నారు. మద్యానికి ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు ఏపీలోనే ఉన్నాయని ఐతే సామాన్యుల పరిస్థితిని అర్ధం చేసుకుని మళ్లీ పాత ధరలే పెట్టాలని అయన డిమాండ్ చేశారు.

 

ఆ మధ్య సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో సీఎం జగన్ కు చెక్కులు ఇచ్చినట్టు ఎమ్మెల్యేలు ఫొటోలు దిగారని అయితే ఏ ఎమ్మెల్యే కూడా తన సొంత డబ్బులు ఇవ్వలేదని ఇచ్చిందంతా ప్రజల డబ్బేనని రఘురామరాజు ఆరోపించారు. ఏపీలో జరుగుతూన్న వాస్తవాలు ప్రజలకు తెలుసని చెప్పారు. సీఎం జగన్ ఈ విషయాలపై దృష్టి పెట్టాలని అయన కోరారు.