క్వాలిఫికేషన్ లేకున్నా రాష్ట్రంలోని అన్ని పోస్టులు రెడ్లకే..!

ఏపీ ప్రభుత్వం ఒక కులానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. క్వాలిఫికేషన్ లేకున్నా రాష్ట్రంలోని అన్ని పోస్టులు రెడ్లకే ఇస్తున్నారని ఆరోపించారు. చైర్మన్ పోస్టు ఉంటే రెడ్డికి.. ఎక్కడైనా రెండు పోస్టులు ఉంటే ఒకటి రెడ్డికే ఇస్తున్నారని అన్నారు. ఎస్వీబీసీ నుంచి ఏ డిపార్ట్ మెంట్ చూసుకున్నా వాళ్లే ఉన్నారంటూ పేరు పేరును చదివి వినిపించారు. రెడ్డి జులుం చేస్తున్నారని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? క్వాలిఫికేషన్ లేని ప్రతి రెడ్డికి ప్రభుత్వంలో ఉద్యోగమిస్తారా? అని రఘురామకృష్ణం రాజు నిలదీశారు.

 

ఇక, రాజధాని అమరావతి గురించి మాట్లాడటానికి తనకేం సంబంధమన్న వైసీపీ నేతలపై కూడా రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. తనకే సంబంధం ఉందని.. కొంతమంది పిచ్చి వాగుడు వాగుతున్నారని ఘాటుగా విమర్శించారు. అమరావతిపై మాట్లాడటం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. విజయవాడ నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఇక్కడి పరిస్థితులపై నాకు అవగాహన ఉంది. రాజధానికి ఇది సరైన ప్రాంతం అన్నారు. " రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు చెల్లవు. అమరావతే రాజధానిగా ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఏదీ సాగదు" అని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు.