కోడల్ని కొడుతున్నాడని కొడుకునే చంపిన తల్లి

 

"అత్త అంటే ఆడదానికి శత్రువు కాదమ్మా..అత్త మనసులోనూ అమ్మ ఉందన్నాడు" ఓ సినీ కవి. కట్నం కోసమో..తన మాట వినడం లేదన్న అక్కసుతోనో కోడల్ని రాచిరంపాన పెట్టే అత్తలను ఎందరినో చూశాం. కానీ కోడల్ని రోజూ హింసిస్తున్నాడని కన్నకొడుకునే చంపింది ఓ తల్లి. ముంబై మన్‌ఖుర్ద్ ప్రాంతానికి చెందిన నదీమ్ అనే యువకుడికి డ్రగ్స్ అలవాటుంది. ఈ క్రమంలో అతనికి రెండేళ్ల క్రితం అలహాబాద్‌కు చెందిన యువతితో పెళ్లి జరిగింది. పెళ్లయ్యింది అన్న మాటేగానీ డ్రగ్స్ సేవించి ఇంటికి వచ్చేవాడు..ఏదో ఒక వంకతో భార్యను చావగొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక ఆమె కొద్ది రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది..అయితే నదీమ్ తల్లి అన్వారీ కోడలికి నచ్చజెప్పి మళ్లీ ముంబై తీసుకొచ్చింది..ఎప్పటి లాగే గత మంగళవారం కూడా నదీమ్ ఫుల్లుగా డ్రగ్స్ సేవించి ఇంటికి వచ్చాడు. కోడల్ని చూస్తే చావబాదుతాడని గ్రహించిన అన్వారీ ఇంట్లో వాళ్లందరినీ నిద్రపుచ్చి..కోడల్ని తన స్నేహితురాలింట్లో దాచింది.. తన భార్య కనిపించకపోవడంతో ఆగ్రహంతో తన తల్లిని దారుణంగా కొట్టాడు. కొడుకులో ఇక మార్పు రాదని గ్రహించిన అన్వారీ తన చున్నీని బిగించి నదీమ్‌ని చంపేసింది..ఉదయం ఇంటికి వచ్చిన కోడలు భర్త శవం పక్కన రోదిస్తూ ఉన్న అత్తను చూసి అసలు విషయం అడగ్గా..నిన్ను రక్షించుకోవడానికి నదీమ్‌ని చంపేశానని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అన్వారీపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.