ప్రాణాలు తీస్తున్న ఉల్లి

ఉల్లిపాయ తరిగితేనే కాదు,ఉల్లి కొనుగోలుకు వెళ్తే కూడా ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్ లో కిలో ఉల్లి 100 రూపాయలు దాటడంతో ఏపీ ప్రభుత్వం సబ్సిడీ మీద ఒక్కో కుటుంబానికి కేజీ ఉల్లిగడ్డలు 25 రూపాయలకు అందించే చర్యలు చేపట్టింది. దీంతో రైతు బజార్లలో ఉల్లి సరఫరా చేస్తున్నారు అధికారులు. కడప రైతు బజార్ లో జనం పడుతున్న ఉల్లి కష్టాలూ చెప్పాల్సిన పనిలేదు. కిలో ఉల్లి కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. స్టాక్ అయిపోయిందనగానే నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇది అక్కడి మహిళలు స్థానికులు నిత్యం ఎదుర్కొంటున్న పరిస్థితి.

ఉల్లి ధరలకు అమాంతం రెక్కలు రావడంతో ప్రభుత్వం కిలో 25 రూపాయల సబ్సిడీ ధరకు రైతు బజార్లలో ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కిలో వంతున పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు కడప రైతు బజార్ లో తగినన్ని ఉల్లి నిల్వలు అందుబాటులో లేకపోవటంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతు బజార్ వద్ద కిలో మీటర్ మేర క్యూలైన్ లలో వేచి ఉన్నారు మహిళలు. రోజూ గంటల తరబడి తాము మార్కెట్ లో పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికీ సబ్సిడీ ఉల్లిగడ్డలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

అటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉల్లి సరఫరా చేస్తున్నామన్నారు మార్కెట్ అధికారులు.చిత్తూరు జిల్లాలోని రైతు బజారులో ఉల్లి పాట్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఉదయం నుంచి ఉల్లి కోసం జనాలు బారులు తీరారు. క్యూలో నిల్చున్న వారి మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట నేపధ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 4 సీఐలు 10 మంది ఎస్సైలతో భద్రత ఏర్పాటు చేశారు.