వైసీపీలో ఏం జరుగుతోంది?.. ఎంపీపై ఎమ్మెల్యే ఫిర్యాదు

అధికార పార్టీ వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం మరింత ముదిరింది. ఎంపీ రఘురామకృష్ణరాజుపై భీమవరం వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. 

తనను, తన సహచర ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఆయన వ్యాఖ్యలు చేసారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు.

కాగా, బుధవారం పోడూరు పోలీస్ స్టేషన్ లో ఇదే రీతిలో మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.