ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఏమీ చేయలేరు.. మంత్రి కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్  

కరోనా కలకలంతో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసందే. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. మరోపక్క.. స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది. 

 

అయితే తాజాగా స్థానిక ఎన్నికల వ్యవహారంపై మంత్రి కొడాలి నాని మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అది సరైన పద్దతి కాదు. నిమ్మగడ్డ మరి కొన్ని నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. తర్వాత రిటైర్ అయ్యి హైదరాబాద్‌లో ఉంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదు. అసలు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఈ విషయంలో ఏమీ చెయ్యలేరు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అలా కాకుండా ఎన్నికల సంఘం తనంత తాను ఎన్నికలు నిర్వహిస్తానంటే అది జరిగే పనికాదు. కరోనా మహమ్మారి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. ఇంతకూ ముందులాగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మందిని తరలించడం కూడా సాద్యం కాదు. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు. అసలు దసరా తర్వాత కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అసలు బీహర్ అసెంబ్లీ ఎన్నికలతో ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు" అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.