గిరిజనులను మావోయిస్టులుగా మార్చేస్తున్న పోలీసులు
posted on Oct 15, 2018 2:53PM
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అండ్రాపల్లి పంచాయతీ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు.ఈ నేపథ్యంలో పోలీసులు,మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.కాల్పుల్లో మహిళా మావోయిస్టు మీనా మృతి చెందింది.మీనా మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్గా పనిచేస్తున్నారు.ఈమె కిడారి,సోమల హత్య కేసులో నిందితురాలు.అయితే మావోయిస్టు నేతలు మీనా ఎన్కౌంటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.మీనా ఎన్కౌంటర్ బూటకమంటూ మావోయిస్టు నేత కైలాసం పేరుతో ఆడియోను విడుదల చేశారు.
ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి మీనాను అతి సమీపం నుంచి కాల్చి చంపారని కైలాసం ఆరోపించారు. కాల్పుల్లో గాయపడిన మీనాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా చంపేశారని అన్నారు. మీనా మృతి మావోయిస్టులకు తీరని లోటని అన్నారు.ఏవోబీలో గల ఆండ్రాపల్లి, జోడాంబో, పనసపుట్టు తదితర ప్రాంతాల్లో బీఎస్ఎఫ్, ఎస్ఓజీ బలగాలు గిరిజనులను చిత్రహింసలు పెడుతున్నాయని, వారిపై మావోయిస్టు ముద్ర వేస్తున్నాయని కైలాసం ఆరోపించారు.కటాఫ్ ఏరియాలోని వివిధ మండలాల్లో ఈ దారుణాలు కొనసాగుతున్నాయన్నారు. బంధువుల ఇంటికి వచ్చిన వారిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని మావోయిస్టులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. పోలీసుల అరాచకాలను అడ్డుకున్న గిరిజనులపై టియర్ గ్యాస్ ప్రయోగించారన్నారు.పెదబయలులో అరెస్టు చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలని ఆడియో టేపులో కైలాసం డిమాండ్ చేశారు.