సంక్రాంతి తరువాత టీడీపీలోకి చేరికలే చేరికలు!!

 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇన్నిరోజులు ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపైనే ఎక్కువ దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇక నుంచి పార్టీ కార్యకలాపాలపైన ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చంద్రబాబు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది. వైసీపీ, జనసేన పార్టీల ప్రభావం ఉన్నచోట ప్రత్యామ్నాయంగా ఎవరిని తెరపైకి తీసుకురావాలి అనే అంశాలపై ఇప్పటికే చంద్రబాబు ఫోకస్ పెట్టారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు, మాజీమంత్రి అహ్మదుల్లా, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు.

అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరతానని చంద్రబాబుకు స్పష్టం చేశారు. టీడీపీ సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు సైతం ఆమెకు హామీ ఇచ్చారు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు సైతం త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మాజీమంత్రి అహ్మదుల్లా సైతం అధికార టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన అహ్మదుల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలోనే అహ్మదుల్లా టీడీపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి సైతం టీడీపీలో చేరేందుకు ఆసక్తి  చూపుతున్నారు. ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో చంద్రబాబును సబ్బం హరి ప్రశంసిస్తూ వస్తున్నారు. పలుమార్లు కలిసి అభినందించారు కూడా. ఇటీవలే డిసెంబర్ 31న చంద్రబాబును ఆయన నివాసంలో సబ్బం హరి కలిశారు. తాను టీడీపీలో చేరతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు పని తీరును మెచ్చుకున్న కొణతాల.. జనవరి 18న టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా కమెడియన్ అలీ కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి తరువాత టీడీపీలోకి భారీగానే చేరికలు ఉండేలా ఉన్నాయి.