టీడీపీని స్వీప్ చెయ్యడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ

 

ఏపీలో టీడీపీని ఖాళీ చేయాలని కమలనాథులు కంకణం కట్టుకున్నారా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ సభ్యులను బిజెపిలో విలీనం చేసుకుంది. ఇక రాష్ట్రంలో ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు వేగంగా ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తుంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లో 2024లో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమేనని జోస్యం చెబుతున్నారు కమలనాథులు. ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీకి ఆ పరిస్థితి ఉండదంటూ టిడిపి పై సెటైర్లు వేస్తున్నారు. బిజెపి నేతల మాటలు చూస్తుంటే రానున్న రోజుల్లో టిడిపిని ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే టిడిపి రాజ్యసభ ఎంపీలు సుజనా, సీఎం రమేష్, టిజి వెంకటేష్, బిజెపిలో చేరారు. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, ప్రధాని మోదీని కలిశారు.దీంతో గంటా కాషాయం తీర్థం పుచ్చుకోవటం ఖాయంగా తెలుస్తుంది.

టిడిపికి ఇటీవల రాజీనామా చేసిన అధికార ప్రతినిధి యామినీ సాదినేని త్వరలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. రాయలసీమలో ఇప్పటికే కొంత మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కాషాయి జెండా కప్పుకున్నారు. గంటాతో పాటు ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.త్వరలోనే అసెంబ్లీలో బీజేపీ కి గౌరవప్రదమైన సంఖ్య వస్తుందని కమలనాథులు చేస్తున్న కామెంట్లు చూస్తే ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా జరుగనున్నట్లు కనిపిస్తుంది.

ఏపీతో పాటు తెలంగాణలోనూ బీజేపీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నుంచి భారీగా నేతలని బీజేపీలో చేర్చుకుంటున్నారు. రెండు రోజులకోసారి తెలుగు రాష్ట్రాల నుంచి టిడిపి నేతలు వెళ్లి ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకుని వస్తున్నారు. తెలంగాణలో టిడిపి ఇప్పటికే అస్థిత్వం కోల్పోయిన పరిస్థితి. ఏపీలోనూ గంటాతో మొదలయ్యే వలసల పర్వం ఎంత దూరం వెళుతుందో అర్థం కాని పరిస్థితి.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా వైసిపి వైపు మళ్లింది. ఏపీలో పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఏపీలో టిడిపిని దెబ్బ తీస్తే తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తూ దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు.