ఆ విషయాన్ని బైబిల్ మీద ఒట్టేసి చెప్పగలరా జగన్?
posted on Jul 17, 2019 3:31PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్టు జగన్ చెప్పారని అన్నారు. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడలేదనే విషయాన్ని జగన్ బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా? అని మంద కృష్ణ ప్రశ్నించారు. మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారంటూ విమర్శించారు. వైసీపీ గెలుపు కోసం మాదిగలు కృషి చేసింది నిజం కాదా? అని అడిగారు. ఎస్సీ వర్గీకరణపై 24 గంటల్లో జగన్ తన వైఖరిని ప్రకటించాలని.. లేకపోతే, 48 గంటల్లో వైసీపీ ప్రభుత్వంపై తమ వైఖరిని ప్రకటిస్తామని మంద కృష్ణ అన్నారు.