మీ హత్యకు కుట్ర జరుగుతోంది.. మాజీ మంత్రి అయ్యన్నకు బెదిరింపు మెసేజ్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు ఆయనకు ఒక వ్యక్తి పంపిన మెసేజ్ కలకలం రేపుతోంది. తాను ఒక ఎస్సై నంటూ అవతలి వ్యక్తి ఆయనకు మేసేజ్ పెట్టారు. ఈ హత్యకు ఇప్పటికే లావాదేవీలు కూడా జరిగాయని ఆ మెసేజ్ సారాంశం. అయ్యన్నను హత్యచేసి దానిని మావోయిస్టులు చేసినట్లు చిత్రీకరిస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఐతే ఈ మేసేజ్ పై అయ్యన్నపాత్రుడు వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వియ్యపు తాతారావు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వియ్యపు తాతారావు బుచ్చయ్యపేట కేటీ ఆగ్రహారానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ తాతారావు గతంలో కూడా పలువురికి బెదిరింపు మేసేజ్‌లు పంపినట్లు పోలీసు విచారణలో తేలింది.