పేరుకే రైతే రాజు... నీటినిచ్చే నది భూములను ఆక్రమిస్తున్న వైసీపీ నేతలు!

 

ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రభుత్వ నిర్మాణం నదీ పరివాహక ప్రాంతంలో ఉందని పగలగొట్టించారు. నీటి వనరుల శాఖ మంత్రి అనిల్ తన సొంతూరైన నెల్లూరు ఇరిగేషన్ స్థలాలు ఆక్రమిస్తే సహించేదేలేదని.. ఎవరు ఆక్రమించినా తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆక్రమించటానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. కానీ ఇటీవల కాలంలో నగర నడిబొడ్డులోనే అత్యంత విలువైన స్థలాల దురాక్రమణ పరంపర యథేచ్ఛగా సాగిపోతుంది. ఒక వైపు రైతులు, రైతు సంఘాలు, ప్రతి పక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరో వైపు నీటి వనరుల శాఖ అధికారులు కొత్త చట్టాలు, జిఓలు కావాలంటున్నారు. 

నెల్లూరు నగరం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ కాలానికి పూర్వమే పెన్నా నది నుంచి సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలు వంటివి ఉన్నాయి. నెల్లూరు ప్రజలు వ్యవసాయం చేయడం, ప్రధానంగా వరి పండించడంలో వారికి వారే సాటి. బ్రిటిష్ కాలంలో పెన్నానదిపై వారధిని నిర్మించి కాలువలని ఆధునీకరించారు. ఈ కాలువల ద్వారా లక్ష ఎకరాలకి అధికారికంగానే సాగు నీరు అందుతుంది. మిగులు నీటితో రైతులు మరో లక్ష ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. నగరం అభివృద్ధి చెందే కొద్ది.. మరీ ముఖ్యంగా 20 ఏళ్లలోనే కాలువల స్థలాలన్నీ కొందరు ఆక్రమించి పెదపాటి నిర్మాణాలు చేపట్టేస్తున్నారు. 2015 లో భారీ వర్షాలు రాగా నగరమంతా మునకకు గురైంది. అందుకు ఆక్రమణలే అసలు కారణమని అందరూ నిర్ధారించారు, కొన్నింటిని తొలగించారు, ఇళ్లలో ఉండే వారికి పునరావాసం చూపి గత పాలకులు తొలగిస్తామన్నారు. 

ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరిగేషన్ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్రమణలన్నీ తొలగిస్తామంటూ స్వయాన సీఎం జగనే ప్రకటించారు. అదే తరహాలో నీటి వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ కూడా ప్రకటనలు చేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున ఇరిగేషన్ స్థలాలు ఆక్రమణలకు గురవుతుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ రైతుల ప్రభుత్వం అని, నీటి పారుదల ప్రాధాన్యమిస్తామని ప్రజాప్రతినిధులు చెబుతుంటే..మరోవైపు అంత కంటే వేగంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.