లగడపాటి చెప్పేశారు.. ఏపీలో సైకిల్ దే జోరు

 

లగడపాటి రాజగోపాల్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీ, తెలంగాణ ఫలితాలపై తన సర్వేను రేపు సాయంత్రం వెల్లడిస్తానన్నారు. రేపు సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగియనుండటంతో.. రేపు సాయంత్రం 5 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. లగడపాటి కూడా రేపు సాయంత్రం తిరుపతిలో మీడియాకు తన సర్వే వివరాలను తెలుపుతానన్నారు. అయితే ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో లగడపాటి మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణలలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో పరోక్షంగా చెప్పేశారు. తెలంగాణ ప్రజలు కారులో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు అన్నారు. అలాగే ఏపీలో లోటు బడ్జెట్ కావడంతో ఏపీ ప్రజలు సైకిల్ పై ప్రయాణానికి మొగ్గు చూపారని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే లగడపాటి అంచనా ప్రకారం.. తెలంగాణలో టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటబోతుంది. ఇక ఏపీలో టీడీపీ అధికారం నిలబెట్టుకోబోతుంది. మరి లగడపాటి అంచనా ఎంతవరకు నిజమవుతుందో ఈ నెల 23 న తేలనుంది.